ఎల్బీనగర్, నవంబర్ 4: తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ చంపాపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వింజమూరు రాఘవాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి శనివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ హ్యా ట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు.
ఎల్బీనగర్లో గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతమైందని, ఎన్నికల్లో విజ యం పక్కా అని చెప్పారు. అనంతరం వింజమూరి రాఘవాచారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఎవరికి వారు అధికారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది నంబర్వన్గా మారిందని చెప్పారు.