కరీంనగర్ : పల్లెలు పట్టణాలుగా మారాలి. అధునీకరణ చెందిన పట్టణాలుగా మెరువాలి. ఆ పట్టణాలను చూసి ప్రజలంతా మురవాలన్న నినాదంతోరాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో సోమవారం పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.
37 వ డివిజన్ రాంనగర్లో రూ.34 లక్షల పట్టణ ప్రగతి నిధులతో ఫిష్ మార్కెట్ అధునీకరణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం రూ.11 లక్షల నిధులతో అత్యాధునిక వసతి సౌకర్యాలతో నిర్మాణం చేసి ప్రజా మరుగు దొడ్డిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి పనులతో అధునీకరణ చెందుతుందన్నారు.
నాలుగో విడుత పట్టణ ప్రగతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. గతంలో నగరంలో ప్రజా మరుగు దొడ్ల సౌకర్యం లేకు మహిళలు, పురుషులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారని ఇప్పడా పరిస్థితి లేదన్నారు. ప్రత్యేకించి మహిళల కోసం పింక్ టాయిలెట్ పేరున త్వరలోనే మరో 3 టాయిలెట్స్ ను నిర్మాణం చేసి మహిళలకు అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామన్నారు.
నగరంలో 5 సమీకృత మార్కెట్లకు ప్రణాళికలు వేసి ఇప్పటికే 4 మార్కెట్ల పనులకు శంఖుస్థాపన చేశామని త్వరలోనే మరో మార్కెట్ ను కూడ ప్రారంభం చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.