హైదరాబాద్, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు జోడెద్దుల్లాంటివని, ఈ రెండింటిని ఏకకాలంలో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం శాసనమండలిలో పట్టణప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, పదేండ్లుగా పట్టణీకరణ వేగం పుంజుకోవడంతో రాష్ట్రంలో పట్టణ జనాభా 45 నుంచి 50 శాతానికి పెరిగినట్టు తాజా సర్వేల్లో తేలిందని వెల్లడించారు. జిల్లాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వివరించారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పౌరులను కేంద్రంగా చేసుకొని మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించలేదని విమర్శించారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటుచేసి, ఆర్థిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్లు సమీకరిస్తున్నట్టు వివరించారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సురక్షిత ప్రయాణం, ప్రయాణ వ్యవధి తగ్గింపు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఎస్సార్డీపీని ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిద్వారా 22 పనులు చేపట్టి 11 ఫ్లై ఓవర్లు, 4 అండర్పాస్లు, 5 ఆర్వోబీలు, కేబుల్బ్రిఢ్జి పూరిచేశామని పేర్కొన్నారు. రూ.5,693 కోట్ల వ్యయంతో చేపట్టిన 24 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని కొనియాడిన ఎమ్మెల్సీ అలుగిబెల్లి నర్సిరెడ్డికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కళకళకాలడుతున్నాయని, విదేశాలకు వెళ్లి వచ్చినవారు సొంతూళ్లలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అమెరికాలో స్థిరపడిన వారు కూడా సొంతూళ్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబరస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనియాడారు. ఉమ్మడిరాష్ట్రంలో జరుగని అభివృద్ధి పనులు ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని మెచ్చుకొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతిపై జరిగిన చర్చ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంగా అవతరిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందన్న ప్రజల ఆకాంక్ష సాకారమవుతున్నదని ప్రశంసించారు. ఉద్యమ సమయంలో చెప్పినట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నదని అభినందించారు.
పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పౌరులను కేంద్రంగా చేసుకొని మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. గత ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించలేదు. – మంత్రి కేటీఆర్