కొత్తకోట, అక్టోబర్ 12 : ‘ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికే మా ఓటు’ అంటూ కొత్తకోట మండలంలోని పాతజంగమాయపల్లి గ్రామస్థులు గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. కనిమెట్ట-పాతజంగమాయపల్లి గ్రామాల మధ్య ఊకచెట్టు వాగుపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్కు ఎన్నో సార్లు విన్నవించుకున్నామన్నారు.
ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు మారినా తమ సమస్య మాత్రం తీరలేదని ఆవేదన చెందారు. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆల వెంకటేశ్వర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తమ కష్టాలను చూసి చలించి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. ఇందుకోసం రూ.12.35 కోట్లు కేటాయించగా.. 80 శాతం పనులు పూర్తయినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 14 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామానికి ఇంత మంచి చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి మద్దతు ఇస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు.