హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. మున్సిపాలిటీగా మార్పు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకి తీసుకుంటున్నామని, ఈ మేరకు పంచాయతీరాజ్ షెడ్యూల్ 8ను మార్పు చేయాల్సిఉన్నట్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించాలని, ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నదని వివరించింది.
ఈ వివరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం రికార్డుల్లో నమోదు చేసుకొని రెండు వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని స్పష్టంచేసింది. భద్రాచలంతో సహా మరో మూడు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ 2005లో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వై రాజు పిటిషన్ దాఖలు చేశారు. భద్రాచలానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్ వీరయ్య 2020లో పిల్ దాఖలు చేశారు. ఈ రెంటింటినీ సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.