రంగారెడ్డి : తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల లో రూ. 253 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణ పనులను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 700 కోట్ల టర్నోవర్ కు చేరిందని పేర్కొన్నారు.
గతంలో పశు సంవర్ధక శాఖను పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘ రాష్ట్రంలో పాడిరైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నార’ ని తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ రంగం ఎదిగేందుకు గేదెలు, గొర్రెలు పెంపకం చేపట్టామని తెలిపారు. అత్యధునిక టెక్నాలజీతో రోజుకు 8లక్షల కెపాసిటీ గల డెయిరీ ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆగస్టులో నూతన డెయిరీని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణ మరో 5 డెయిరీల ఏర్పాటు అవసరముందని పేర్కొన్నారు. దేశంలో పాడిరైతులకు ఇన్సెంటీవ్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 2 వేల డెయిరీ ఔట్ లెట్ లను ప్రారంభించామని ఆయన వెల్లడించారు. త్వరలో మరో 2 వేల ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని లక్ష్యం గా ముందుకు సాగుతున్నామని వివరించారు. నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు తో వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.