హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): పాడిరంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు విజయ డెయిరీ బోర్డు నిర్ణయించిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం విజయ డెయిరీ చైర్మన్ సోమ భరత్కుమార్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలోమంత్రి మాట్లాడారు.
విజయ డెయిరీకి సక్రమంగా పాలు పోసే రైతులకు ముద్ర రుణాలు మంజూరు చేయిస్తామని, తద్వారా వారు అదనపు పాడి పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరో 6 నెలల్లో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్ల వ్యయంతో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డెయిరీ ప్రారంభం కానున్నదని, అందుకు అనుగుణంగా పాల సేకరణ జరగాల్సి ఉందని తెలిపారు.