హైదరాబాద్ : ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పశుసంవర్ధకశాఖ, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రాజేంద్రనగర్లోని కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో వివిధ జిల్లాల విజయ డెయిరీ డీడీలు, మేనేజర్లకు ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ ప్లాన్పై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వర్క్ షాప్ను ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయరంగం తర్వాత పాడిపరిశ్రమ రంగంపై కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయన్నారు. ఈ పరిశ్రమ రంగం అభివృద్ధికి, దానిపై ఆధారపడ్డ రైతులకు ప్రభుత్వం అన్నిరకాలుగా చేయూతను అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన విజయ డెయిరీ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పాడి రైతుల అభ్యున్నతికి డెయిరీ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ, దాణా అందజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జీవాల వద్దకే వెళ్లి సంచార పశువైద్యశాలలు సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు. మేలు జాతి పశు సంపద, పాల ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విజయ డెయిరీ, పశుసంవర్ధక శాఖ, గోపాల మిత్రలు, టీఎన్ఎల్డీఏ ఆధ్వర్యంలో జీవాల ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ గర్భధారణ, ఇతర యాజమాన్య పద్ధతులపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రణాళికబద్ధంగా పని చేస్తే పాల ఉత్పత్తి సాధ్యమేనన్నారు.
డెయిరీ రైతులతో సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు విశేషమైన ప్రజాదరణ ఉన్నదని, అన్ని ప్రాంతాల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. పోటీ మార్కెట్లో ప్రైవేటు డెయిరీలకు దీటుగా డెయిరీ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. విజయ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో గుర్తించిన 12 ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఔట్లెట్లకు సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించాలని, రాబోయే ఆరు నెలల్లో అమలు చేయాలని ఆదేశించారు.
పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకుంటూ.. విజయ డెయిరీని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుపేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి సూచించారు. వర్క్షాప్లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హెచ్ఎస్కే తంగిరాల తదితరులు పాల్గొన్నారు.