కేసముద్రం, ఏప్రిల్14: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో చెరువులో పడిన ఇద్దరితోపాటు ఎడ్లను గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడాడు. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి ఐలయ్య తన మనువడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తున్నారు. ఎడ్లబండికి వెనకాల ఆవును తాడుతో కట్టుకొని తీసుకొస్తున్నారు. చెరువు వద్దకు వచ్చిన తరువాత ఐలయ్య ఎడ్లకు నీరు తాగించడానికి ఒడ్డుకు తీసుకెళ్లాడు.
ఆ ప్రాంతంలో జేసీబీతో మట్టి తవ్వడంతో గుంత ఏర్పడింది. అది కనిపించకపోవడంతో ముందుకెళ్లిన బండి, ఎడ్లు, ఆవుతోపాటు రైతు ఐలయ్య, ఆయన మనువడు అశ్విత్ గుంతలో మునిగిపోయారు. ఇదే సమయంలో గొర్రెలను తోలుకుని ఇంటికి వస్తున్న గొర్రెల కాపరి విజయ్ వారిని గమనించాడు. సాహసంతో చెరువులోకి దిగి.. ఐలయ్య, అశ్విత్ను బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడాడు. బండికి ఉన్న ఎడ్లను సైతం ప్రాణాలతో రక్షించాడు. ఆవు నీటిలో మునిగి మృతి చెందింది. గొర్రెల కాపరి విజయ్ ధైర్యాన్ని గ్రామస్థులు అభినందించారు.