KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్లుగానే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలన్నారు. డిసెంబర్ 9న 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఒక రూపం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9న చేపట్టాల్సిన కార్యక్రమాలను సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని చెప్పారు. పార్టీ కార్యాలయాల వద్ద లేకపోతే ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగుర వేయాలన్నారు. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తు చేయాలన్నారు. కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మరో రెండు రోజులు సమయం ఉన్నందున జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.