వికారాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ పథకంపై బురదజల్లే ందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
‘దళితబంధు’ను రద్దు చేస్తారని ప్రచారం జరగడంతో ఈ పథకాన్ని కొనసాగించాలని వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే అనేక దళిత కుటుంబాలు కలెక్టర్తోపాటు సంబంధిత అధికారులకు విన్నవించాయి. కానీ, అందుకు ప్రభుత్వం సానుకూలంగా లేనట్టు తెలుస్తున్నది. ‘దళితబంధు’ నిధులు దుర్వినియోగమైనట్టు ఫిర్యాదులు వచ్చాయంటూ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని ఆదేశించింది.
దీంతో వికారాబాద్ జిల్లాలో ‘దళితబంధు’ తొలి విడత లబ్ధిదారులపై విజిలెన్స్ బృందం విచారణ మొదలుపెట్టింది. ఈ పథకం కింద వారు ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలపై అధికారులు గత పది రోజుల నుంచి ఆరా తీస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు లబ్ధిదారులను ఎంక్వైరీ చేసినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ హయాంలో 358 కుటుంబాలకు లబ్ధి
వికారాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ‘దళితబంధు’ అమలుకు అధికారులు తొలి విడతలో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.35.80 కోట్లు విడుదల చేసింది. దీంతో వికారాబాద్లో 100, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్లో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్లను అధికారులు గ్రౌండింగ్ చేశారు.
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. అనంతరం జిల్లాలో రెండో విడత ‘దళితబంధు’ అమలు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.60 కోట్లు విడుదల చేయడంతో లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ ప్రక్రియ మధ్యంతరంగా నిలిచిపోయింది.
నాలుగు నెలలైనా స్పష్టత కరువు
రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘దళితబంధు’ అమలుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకాన్ని కొనసాగించాలని రెండో విడత లబ్ధిదారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. పైపెచ్చు ‘దళితబంధు’ కింద కొత్తగా ఎవరికీ ఆర్థిక సాయం చేయవద్దని అధికారులను ఆదేశించింది. అంతటితో ఆగకుండా జిల్లాలో రెండో విడత దళితబంధుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన రూ.60 కోట్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆ నిధులను ‘దళితబంధు’ లబ్ధిదారులకు మంజూరు చేస్తారా? అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నదానిపై రేవంత్ ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది.