హైదరాబాద్, ఫిబ్రవరి 13 : చట్టవ్యతిరేక పనులకు పాల్పడి స్పెషల్ హోంలలో ఉంటున్న పిల్లలు న్యాయస్థానాలకు భౌతికంగా హాజరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోని పరిశీలన నిలయాలు (అబ్జర్వేషన్ హోమ్స్), ప్రత్యేక నిలయాల (స్పెషల్)లో ఉన్న పిల్లలు ఆయా నిలయాల నుంచే వారి కోర్టు ప్రోసీడింగ్స్ను అనుసరించే అవకాశం కలిగింది. పిల్లలు వారి కేసు వాయిదాలకు పోలీసులతో న్యాయస్థానాలకు హాజరుకావడం, కోర్టులలో అందరి ముందు మాట్లాడటం వంటి పరిస్థితులతో మానసిక అశాంతత, ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని అధిగమించి స్నేహపూర్వక వాతావరణంలో వాయిదాకు హాజరుకావాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఆయా నిలయాల్లో ఉన్న పిల్లలను సన్మార్గంలో నడిపించేందుకు ఈ సౌకర్యం తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.