హైదరాబాద్ : యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిక్రిందాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, సినీ నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం అన్నారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు.
కులమతాలకు అతీతమైందని, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అన్నారు. ప్రపంచదేశాల్లో శాంతికి దోహదం చేస్తుందని, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారని, ఏ స్థాయిలో ఉన్నా యోగా తప్పనిసరి సాధన చేయాలన్నారు. కొంత సమయమైనా యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని, పెద్దలు మనకు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచ శాంతిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని, యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.