హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గుజరాత్ మాడల్, వైబ్రంట్ గుజరాత్ అన్నది ఉత్త భ్రమ అని ఆ రాష్ర్టానికి చెందిన సిటిజన్ రిసోర్స్, యాక్షన్ ఇనీషియేటివ్ (క్రాంతి) సంస్థ నాయకుడు భరత్సిన్హా జాలా చెప్పారు. గుజరాత్ గురించి వాస్తవం చెప్పాలంటే.. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అని వర్ణించారు. సుదీర్ఘంగా పరిపాలిస్తున్న బీజేపీ.. రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రైతులను దగా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుజరాత్లో రైతు ఆత్మహత్యలు తగ్గలేదని,. రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా వర్తించడం లేదని చెప్పారు.
వేల కోట్లు బీమా కంపెనీలకు చెల్లిస్తున్నప్పటికీ రైతులకు ఇస్తున్నది సున్నా అని, దీనిపై తాము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించామని వివరించారు. గుజరాత్లో రైతాంగ పక్షాన అనేక పోరాటాలు చేసిన సంస్థ ‘క్రాంతి’లో కీలక నేతగా ఉన్న భరత్సింగ్ జాలా.. తెలంగాణలో అభివృద్ధి, రైతులు, వ్యవసాయ రంగ స్థితిగతులను అధ్యయనం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నదని, చేసేదే చెప్తున్నదని ప్రశంసించారు. ఆయన ఇంకేమన్నారంటే..
ఫసల్ బీమాను మా రాష్ట్ర రైతులెవ్వరూ ఇప్పటివరకు తీసుకోలేదు. మేం ఈ పథకం అమలుపై న్యాయపోరాటం చేస్తున్నాం. కేవలం ఆరు బీమా కంపెనీలు లబ్ధిపొందాయి. మా రాష్ట్రంలో 23 లక్షల మంది ఫసల్ బీమాకు అర్హులున్నారు. రైతులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క బీమా కోసం గడిచిన ఎనిమిదేండ్లలో రూ.1.80 లక్షల చొప్పున చెల్లించినా, ఆ సొమ్మంతా బీమా కంపెనీలే తీసుకొన్నాయి. రైతులకు పరిహారం ఇవ్వలేదు. మహ్మద్ గజనీ దోచుకున్నారని చరిత్రలో విన్నాం. ఇక్కడ చూస్తున్నాం. ప్రధానికి రైతుల పట్ల నిబద్ధ్దత ఉంటే ఆయా బీమా కంపెనీలపై రాజద్రోహం కేసు పెట్టాలి కదా! కానీ, కేంద్రం ఆ కంపెనీలను ఏమీ అనడంలేదు.
గుజరాత్లో నీళ్లు కొన్ని ప్రాంతాలకే పరిమితం. మా దగ్గర ఆయకట్టు చివరి భూములకు నీళ్లు రావు. కాలువల పరిస్థితి అధ్వాన్నం. రైతులు విద్యుత్తు మోటర్లను కాలువలకు పెట్టుకుంటే క్రిమినల్ కేసులు పెట్టిన చరిత్ర ఉన్నది. రైతులను నీళ్ల దొంగలుగా చిత్రీకరించిన ఘనత గుజరాత్ ప్రభుత్వానిదే. మీరు మా నాయకులను కాదు.. మా ప్రాంత రైతులను అడగండి. నిజాలు చెప్తారు. తెలంగాణాలో కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను చూశాం. పొలాలకు కూడా వెళ్లి వచ్చాం. రైతులు ఆనందంగా ఉన్నారు. రైతులకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చినందుకు ఇక్కడి ప్రభుత్వం చార్జీలు ఏమీ వసూలు చేయడం లేదు.
రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వం రైతుల కోసం, వ్యవసాయ రంగానికి వెచ్చించేవి అత్తెసరు నిధులే. మా దగ్గర రైతుబంధు లేదు. రైతుబీమా లేదు. పంటల బీమా లేదు. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో కొంతమందికే ఏడాదికి ఆరువేలు ఇస్తున్నది. గుజరాత్లో రైతు ఆత్మహత్యలు ఎక్కువ. ఇది మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2003-07 మధ్య 2,479 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 2008-12 మధ్య 152 మంది, 2012-16 మధ్య 85 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. ఏటా రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ క్రైంబ్యూరో లెక్కల ప్రకారం గుజరాత్లో ప్రతి రెండేండ్లలో కనీసం 2,500 మంది రైతులు మరణిస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం.
దేశంలోనే తెలంగాణను రైతు రాష్ట్రంగా చెప్పవచ్చు. రైతుల కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. రైతులకు ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి నాయకుడుగా ఎన్నడూలేరు. ఇప్పుడు మేం గర్వంగా చెప్పగలం. మా నాయకుడు రైతు అని, సీఎం కేసీఆరే మా నాయకుడు. ఆయన విధానాలు, ఆలోచన అద్భుతం. రైతులకు ఎకరాకు పదివేలు పెట్టుబడి సహాయం, వ్యక్తిగత బీమా పథకం, ఉచిత విద్యుత్తు, కాలువల ద్వారా సాగునీళ్లు ఇవ్వడం వంటివి మా మూలు విషయాలు కావు. ఇవన్నీ చరిత్రాత్మకం. తెలంగాణ రైతులతో మాట్లాడితే వారు ఆనందంగా ఉన్నట్టు అర్థమైంది.