హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించి కూడా కిషన్ రెడ్డి మాట్లాడాలని చురకలంటించారు. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి.. రాయితీ తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకాన్ని కేంద్ర పోత్సహిస్తున్నదని, ఆస్తులు అమ్మడంలోనూ కేంద్రం వృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలకు కేంద్ర నుంచి నిధులు వెళ్తున్నాయని, అయితే రాష్ట్రం నుంచి వెళ్లే నిధులు ఎక్కువని, వచ్చేవి మాత్రం తక్కువని చెప్పారు. గుజరాత్లో కేవలం 2.56 శాతం మాత్రమే వృద్ధిరేటు ఉందని చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే చాలా తక్కువ వృద్ధిరేటు ఉందన్నారు. నేతలు వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల విషయంలోనూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల పరిమితిని కేంద్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. జీఎస్డీపీలో 22.83 శాతం అప్పులు తీసుకున్నామని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో అప్పులు పరిమితికి మించి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విధానాలు బాగున్నాయి కాబట్టే అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నన్నాళ్లు రాష్ట్రంలో మొదటి స్థానం తమదేనని చెప్పారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోరాడుతున్నాయని చెప్పారు. ఉద్యోగ ఖాళీల వివరాలు సిద్ధం చేశామని, త్వరలోనే కేబినెట్లో నివేదిస్తామన్నారు. ఏ జిల్లా వారికి నష్టం జరగకుండా కసరత్తు చేస్తున్నామని అన్నారు. జిల్లాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, విద్యుత్ చట్టాలు వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అందిస్తామని స్పష్టం చేశారు.