హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) చైర్మన్గా ఆయనను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
వేణుగోపాలాచారి రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. నిర్మల్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి 1985 నుంచి 1996 వరకు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతూనే 1996లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్ మంత్రి వర్గంలో సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ, వ్యవసాయశాఖల మంత్రిగా సముద్రాల బాధ్యతలు నిర్వర్తించారు.
1998లో మరోసారి ఎంపీగా గెలిచి వాజపేయి ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి 2004 వరకు అదే పదవిలో కొనసాగారు. 2004లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ముధోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. 2013లో బీఆర్ఎస్లో చేరిన తర్వాత 2014లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా సముద్రాలను సీఎం కేసీఆర్ నియమించారు. ఎంతో అనుభవం ఉన్న వేణుగోపాలాచారికి కీలకమైన ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం ప్రకటించాయి.