మెదక్ : మెదక్(Medak) గడ్డ అంటేనే గులాబీ(BRS) అడ్డ అని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, పి వెంకట్రామిరెడ్డి(Venkatramireddy) అన్నారు. ఆదివారం తూప్రాన్లో జరిగిన తూప్రాన్, మనోహరబాద్ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడా అధికారిగా, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా ఇక్కడ పని చేశాన న్నారు. నాటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో 50 ఏండ్లు ముందుకు పోయిందన్నారు. మాయ మాటలు రావని, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, ఆయన స్పూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు.
నాకు డబ్బు మీద యావ లేదని, పేద ప్రజల సేవ మీదనే నా దృష్టి ఉందన్నారు. రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటామన్నారు. యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.మహిళలకు సైతం కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తామని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.