హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయానికి నేను, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మాదకద్రవ్యాల వాడకం, చట్టవిరుద్ధ కార్యాకలాపాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కొందరు నీచ రాజకీయాల కోసం డ్రగ్స్ కేసు పేరిట బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
మనుషులను రాక్షసులుగా మార్చే మాదకద్రవ్యాలను బాధ్యతాయుతమైన పదవులు, హోదాల్లో ఉన్న వ్యక్తులు వినియోగించడం సరికాదని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతున్న, విక్రయిస్తున్న వారిని రాజకీయాలు, పదవులతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టంచేశారు.
అయితే కొందరు, తామంటే గిట్టని రాజకీయ పార్టీలు తమ నీచ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను డ్రగ్స్ కేసులోకి లాగేందుకు యత్నిస్తున్నాయని తీవ్రంగా ఖండించారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ‘డ్రగ్స్ వినియోగంపై ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాను.
ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సూచనలను స్వాగతిస్తున్నాను. మనమందరం ఆదర్శంగా నిలుద్దాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తిలేదని, చట్టపరమైన నోటీసులిస్తానని హెచ్చరించారు.