రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ కార్గో ద్వారా రాజన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఏడాదిన్నర కార్గో ద్వారా రాష్ట్ర ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.100కోట్ల ఆదాయం కార్గో ద్వారా ఆర్టీసీ గడించిందని, సమ్మక్క-సారక్క జాతరలో బంగారం కోసం కార్గోకు ఆదరణ లభించిందని చెప్పారు. భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సంబంధించి తలంబ్రాల కోసం లక్షకుపైగా ఆర్డర్లు వచ్చాయని, జగిత్యాల నుంచి 22 టన్నుల మామిడిపండ్లను కార్గో ద్వారా ప్రజలకు సరఫరా చేసినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్, రాజన్న ఆలయ అధికారులతో చర్చించి రాజన్న ప్రసాదం సైతం కార్గో ద్వారా భక్తులకు అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. కరీంనేగర్ బృందం బాగా పని చేస్తుందని, జిల్లా యంత్రాంగం ఆర్టీసీకి బాగా సహకరిస్తుందన్నారు.
వేములవాడ గొప్ప పుణ్యక్షేత్రమని, రాజన్న దర్శనానికి 30వేల మంది వస్తుండగా.. 9వేల మంది ఆర్టీసీ దర్శనానికి వస్తున్నారని చెప్పారు. వేములవాడతో పాటు దగ్గరలో ఉన్న ఆలయాలతో కలిపి టూరిస్ట్ ప్యాకేజీ రూపొందిస్తామని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్టీసీకి మంచి ఆదరణ ఉందని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికులను ఆకర్షించే విధంగా మరింత నూతన ఆలోచనలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కొత్తగా 116 బస్సులను కొనుగోలు చేస్తున్నామని, జిల్లా కేంద్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిలో వీటిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల హెడ్క్వార్టర్స్ నుంచి ఈ వాహనాలను నడిపించనున్నట్లు పేర్కొన్నారు.
దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా అధికారులతో కలిసి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని, రాష్ట్రంలో ప్రజలందరికీ ఆర్టీసీ బస్సుతో ఒక అనుబంధం ఉందని, ప్రతి అవసరానికి ఆర్టీసీని వాడుకోవాలని కోరారు. గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఆర్టీసీ పట్ల అవగాహన కల్పిస్తామని సజ్జనార్ తెలిపారు. కాలానుగుణంగా ప్రజలకు సేవలందించేలా ముందుకెళ్తున్నామన్నారు. డీజిల్ భారం కూడా ఎక్కువైందని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నిపుణుల సహాయం తీసుకొని భారాన్ని తగ్గించుకుంటామన్నారు. 72శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని, ఎక్కువ చేసిన కార్మికులకు ఇన్సెంటివ్ ఇస్తున్నామన్నారు. కార్మికులకు వేతనాలు ఒకటో తేదీనే వేస్తున్నామని, ఇటీవల డీఏ సైతం ఇచ్చామన్నారు. నెల రోజుల్లో ఆర్టీసీ యాప్ను ప్రారంభిస్తామని, గ్రామీణ ప్రాంతంలోని ప్రయాణికుడు బస్సు ఎక్కడుందో తెలుసుకొని ప్రయాణం చేయవచ్చన్నారు.