భీమ్గల్, అక్టోబర్ 4: సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అసలు మోదీయే అత్యంత అవినీతిపరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయని గుర్తుచేశారు.
దేశంలోని ప్రభుత్వ సంస్థలను తన మిత్రుడు అదానీకి మోదీ అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. 12 లక్షల కోట్ల ప్రజల సొమ్మును తన కార్పొరేట్ మిత్రుల కోసం మోదీ రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. అలా అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎనిమిది రాష్ర్టాల్లో స్థానిక ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొంటామని బీజేపీ పంపిన స్వాముల వీడియో రికార్డులను దేశ ప్రజలంతా చూశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తన్నారని ఓ కట్టుకథ అల్లి బహిరంగ సభలో చెప్పడం మోదీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని వేముల విమర్శించారు.