ఖలీల్వాడి, సెప్టెంబర్ 2: నిర్మలా సీతారామన్ విఫలమైన ఆర్థికశాఖ మంత్రి అని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. కామారెడ్డి పర్యటనలో తాను ఒక కేంద్ర ఆర్థికశాఖ మంత్రిననే సోయి లేకుండా ఆమె వ్యవహరించారని దుయ్యబట్టారు. రేషన్షాపు ముందు చిల్లర రాజకీయాలు చేశారని, జిల్లా కలెక్టర్ను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. నిర్మలాసీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఆమె చేసిన ఆరోపణలకు మంత్రి హరీశ్రావు గణాంకాలతో సహా వివరించడంతో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం రద్దు చేసుకొని పారిపోయారని ఎద్దేవా చేశారు.
ఇలాంటివారు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరే మోదీ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిస్తున్నారని, ఆ ఆక్రోశంతోనే కేంద్రమంత్రులు అసత్య ప్రచారాలు, ఆరోపణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రేషన్షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ కలెక్టర్ను నిర్మలా సీతారామన్ బెదిరించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే పన్నులతోనే బీజేపీ రాష్ర్టాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని, మరి అక్కడ కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చింది రూ.1,500 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.