మోర్తాడ్, ఏప్రిల్ 15: పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ‘ఈ-నామ్’ కాకుం డా బహిరంగవేలంతో పసుపు కొనుగోలు జరగడంతో మద్దతు ధర పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిజామాబాద్ గంజ్లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీగా అర్వింద్, జాతీయ పసుపుబోర్డు చైర్మన్ ఉండి కూడా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. ఇటీవల ఎంపీ అర్వింద్ ఈ-నామ్ 1.50 కింద కొనుగోలు ప్రారంభిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోలు నిలిపివేసి వేలం నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు. మొదట ఈ-నామ్ 2.50 గురించి మాట్లాడి తర్వాత 1.50 అని చెప్పి రైతుల్లో గందరగోళం సృష్టించారని విమర్శించారు. దళారులు కుమ్మ క్కై తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వేలాన్ని నిలిపివేయాలని, ఈ-నామ్ విధానంలో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.