హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): సవాళ్లు విసరడం, తొడగొట్డడం, తొండిచేయడం, పారిపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నైజమని, ఆయన క్యాబినెట్లోని మంత్రులు పక్కా పలాయనవాదులని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మొన్న రాష్ట్రంలో జరిగిన సవాళ్ల తతంగంలో కాంగ్రెస్ మంత్రుల డొల్లతనం, సీఎం రేవంత్రెడ్డి అసమర్థ వ్యవహారం తెలంగాణ ప్రజల ముందు బట్టబయలైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విరిసిన మంత్రులు పోలీసులను అడ్డంపెట్టుకొని పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో పార్టీ సీనియర్ నేతలు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, కిశోర్గౌడ్, గౌతంప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
చర్చకు రాకుండా హరీశ్రావు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను వందలాది పోలీసులతో అడ్డుకున్న సర్కార్.. హరీశ్రావును డీసీఎం వ్యాన్లో పడేసి, నగరమంతా తిప్పి కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో నిర్బంధించడం దారుణమని వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ చేస్తే ఎత్తకుండా పోలీసుల వెనుక దాక్కున్న ముగ్గురు మంత్రులు పారిపోయారని, కాంగ్రెస్ సర్కార్ పరువు గంగలో కలిసిందని దుయ్యబట్టారు. సబ్జెక్ట్లేని వారే ఇలాంటి డ్రామాలాడుతారని, బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పే దమ్మూధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదని పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం, మంత్రులు అప్పుల పేరిట బూటకపు నాటకాలకు తెరలేపారని విమర్శించారు.
‘సవాల్ విసిరింది రేవంత్రెడ్డి.. స్వీకరించింది కేటీఆర్. కానీ, మధ్యలో దూరిన జూపల్లి కృష్ణారావు తెలంగాణభవన్కు వస్తానని బీరాలు పలికారు. గన్పార్క్, ప్రెస్క్లబ్ అని వేదికలు మార్చారు. చివరకు పలాయనం చిత్తగించి జోకర్లా మారార’ని వేముల ప్రశాంత్రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో అప్పు చేసిన ప్రతి పైసానూ మౌలిక వసతుల కల్పన, సాగు, తాగునీరు, విద్య, వైద్యరంగాల బలోపేతం, రైతాంగా సంక్షేమానికి వినియోగించామని చెప్పారు.
గురుకుల స్కూళ్లు, హాస్టళ్ల యూనిఫామ్ టెండర్లను చేనేత కార్మికుల సంస్థ టెస్కోకు ఇవ్వాలని స్వయంగా చేనేత, జౌళి శాఖ మంత్రి కొండా సురేఖ లేఖరాసినా, వేరే వాళ్లకు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని, ఆమె రాసిన లేఖను బయటపెట్టాలని వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతున్నదో తెలియడంలేదని, అంతా సీఎం కార్యాలయ పర్యవేక్షణలోనే వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ బాధ్యతలను విస్మరించి రేవంత్రెడ్డికి రక్షణ కవచంలా మారడం సిగ్గుచేటని ప్రశాంత్రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ఆయన తెరపైకి వచ్చి బీఆర్ఎస్పై బురదజల్లి కాపాడేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తాము చేసే ఆరోపణలు నిజంకాదనుంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సీఎం బావమరిదికి అమృత్ టెండర్లలో లబ్ధి చేకూరిందని, ఆయన అవినీతిపై కేటీఆర్ కేంద్రానికి ఆధారాలు సహా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు?
సింగరేణిలో బొగ్గు మాయమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సీఎంకు లేఖ రాసినా, ఎందుకు విచారణ జరిపించడంలేదు? సింగరేణి కోల్స్కామ్లపై ఆరు నెలల క్రితం వచ్చిన కేంద్ర కమిటీ నివేదికను బయట పెట్టడంలేదేందుకు? కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ మంత్రిపై జరిగిన ఈడీ దాడుల నివేదికను తొక్కి పెట్టడంలోని అంతర్యమేంది?’ అంటూ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరిట హామీలు గుప్పించిన రాహుల్గాంధీ చర్చకు సిద్ధమైతే, కేసీఆర్ను చర్చకు ఒప్పించే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు.