హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సామాన్యులు ఎల్ఐసీ ప్రీమియం కట్టినా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో బాదుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమవడంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటాను ఎందుకు తేల్చడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. నెలకోసారి తెలంగాణకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ విషయాలపై ఎందుకు సమాధానివ్వరని నిలదీశారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ.. తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని ధ్వజమెత్తారు. 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థల విభజనను ఎనిమిదేండ్లయినా పూర్తిచేయలేదని, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
భట్టి ప్రశ్నలపై నవ్వులే నవ్వులు
అంతకుముందు భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ‘గిరిజన యూనివర్సిటీ ఏమైంది? ఐటీఐఆర్ ఏమైంది? రైల్వేకోచ్ ఫ్యాక్టరీని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చారా? హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చిందా? ఇవి ఎందుకు రావడంలేదు? మీరంతా ఏం చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నలు సంధించడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ ప్రశ్నలు ఎవరిని అడుగుతున్నారని స్పీకర్ అనడంతో.. ‘బీజేపీనే’ అని భట్టి సమాధానమిచ్చారు.
భట్టి వ్యాఖ్యలకు ప్రశాంత్రెడ్డి కౌంటర్
తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించడంపై మంత్రి ప్రశాంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు 2009లో చేసిన ప్రకటన నుంచి వెనక్కి మళ్లి వేలాది మందిని పొట్టనబెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ.. 2014లో తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణను ఇచ్చిందని గుర్తుచేశారు. అన్ని పార్టీలను ఒప్పించేందుకు సమయం పట్టిందన్న భట్టి వ్యాఖ్యలపైనా ప్రశాంత్రెడ్డి ఫైర్ అయ్యారు. ‘39 పార్టీలను ఒప్పించిందీ, చెప్పులు అరిగేలా తిరిగిందీ మేమే’ అంటూ భట్టి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘అభివృద్ధి చాలు.. ప్రత్యేక రాష్ట్రం వద్దు’ అంటూ నాడు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్రెడ్డి గుర్తుచేయడంతో ఆయన చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు.