నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పట్టణంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో నిరాహారదీక్ష చేపట్టారు. భారీగా తరలివచ్చిన శ్రేణులతో కలిసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ కఠోర నిరాహార దీక్షకు దిగారు. కాగా, వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు.
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే… ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
తమది ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని హరీశ్రావు విమర్శించారు. హిట్లర్ స్పూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.