హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు పరిష్కరించిన అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాదర్బార్ కాదు దగాదర్బార్, డ్రామా దర్బార్ అని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణభవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం ముగిసిన అనంతరం వేముల మీడియాతో మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలుచేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రభుత్వంపై తమకు అక్కసు లేదని స్పష్టంచేశారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్గా మా ర్చిన సీఎం రేవంత్రెడ్డి తొలిరోజు అట్టహాసంగా ప్రజాదర్బర్ ప్రారంభించి, ఆ తరువాత రెండుమూడు రోజులు మంత్రులకు, ఆ తరువాత అధికారులకు అప్పగించి, దాన్నొక ప్రహసంగా మార్చారని మండిపడ్డారు. ఈ నెలలో ప్రజావాణిలో ఎన్ని సమస్యలు పరిష్కరించారు? ఎంతమందికి న్యాయం చేశారు? వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలనను ప్రజల దగ్గరకు చేరుస్తామని చెప్పిన రేవంత్రెడ్డి చివరికి ప్రజలను బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు
ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నా ప్ర జల నుంచి దరఖాస్తులు స్వీకరించడంలో ఆం తర్యం ఏమిటని వేముల ప్రశ్నించారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలకు కూడా దరఖాస్తులు స్వీకరించడంలో ఆంతర్యం కాలయాపన చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో పథకాల అమలుకు ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఒక్కటే అమలుచేసిందని చెప్పారు. బస్సు సర్వీసులను తగ్గించి మహిళలను ఇబ్బం ది పెడుతున్నదని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి దెబ్బతిన్న ఆటో డ్రైవర్లకు నెలకు కనీసం రూ.15 వేలు ఇచ్చే పథకానికి రూపకల్పన చేయాలని కోరారు. ఆటోడ్రైవర్ల భిక్షాటన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ విధానమా?
కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పథకాలను రద్దు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా? అని వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పరిపాలనా వికేంద్రకరణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన జిల్లాల సంఖ్యను తగ్గిస్తామనడం సరికాదని చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన అంశాన్ని ప్రభుత్వ వేదిక మీద కాకుండా, మంత్రులతో చర్చించకుండా, అధికారులతో సంప్రదించకుండా ఒక టీవీ చానెల్ డిబెట్లో ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్ల పంపిణీ వంటి వాటిని రద్దుచేయడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకున్నదని ఎద్దేవాచేశారు. రేవంత్రెడ్డి అసంబద్ధ విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ, మెట్రోరైల్ అలైన్మెంట్ వంటి విషయాల్లో ముందు ఒకటి చెప్పి, ఆ తరువాత మాట మార్చారని ఉదహరించారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇప్పటికే ఫార్ములా ఈ-రేస్ రద్దు అయిందని చెప్పారు. వాగ్దానాలు, వాయిదాలు, రద్దులు, ఢిల్లీ పర్యటనలు అన్నచందంగా నెలరోజుల రేవంత్రెడ్డి సర్కార్ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని, రుణమాఫీ చేస్తామన్న రేవంత్రెడ్డి ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నెలలో ఆరుసార్లు ఢిల్లీ టూర్ : రమణ
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత నెలరోజులకే ఆరుసార్లు ఢిల్లీకి వెళ్లడం వల్ల తనకు తాను బలహీన సీఎం అని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్గుప్తా, జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.