‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతి నిరోధకులుగా మీ ముందుకు వచ్చేవాళ్లు తెలంగాణ నాయకులే. భవిష్యత్తులో మీరు పోరాడాల్సింది తెలంగాణ నేతలతోనే?’ అని ప్రొఫెసర్ జయశంకర్ అంటుండేవారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తున్న వారిలో కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ కూడా చేరడం దురదృష్టకరం. ఇచ్చంపల్లిని కేసీఆర్ తిరస్కరించారనే విషయాన్ని మనసులో పెట్టుకుని కాళేశ్వరంపై విషం చిమ్ముతున్నారు. కేసీఆర్పై బట్టకాల్చి మీదవేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి పత్రికలో ‘కాళేశ్వరం కహానీ’ పేరిట విషం చిమ్మడం మొదలుపెట్టారు.
– తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్, నీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్
Vedire Sriram | హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్శక్తిశాఖ సలహాదారు, నదుల అనుసంధానం ప్రాజెక్టు టాస్క్ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఆయన ప్రస్తావిస్తున్న అంశాల్లో సారమేమైనా ఉన్నదా? అసలు ప్రాజెక్టుకు సంబంధించిన నిజానిజాలేమిటి? ఎందుకు రీ డిజైనింగ్ చేయాల్సి వచ్చింది? అందుకు పురికొల్పిన కారణాలేమిటి? కారకులు ఎవరు? ఇత్యాది అనేక అంశాలను యావత్ తెలంగాణకు వివరించాలనే ప్రయత్నంలో భాగంగా ‘నమస్తే తెలంగాణ’లో తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్, నీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్ కౌంటర్.
సీడబ్ల్యూసీ సూచనల మేరకే రీ ఇంజినీరింగ్
తెలంగాణ ఉద్యమంలో విదేశాల్లో ఉంటూనే చురుకైన పాత్ర నిర్వహించిన వెదిరె శ్రీరాం.. ఇప్పుడు గోదావరి జలాలను తెలంగాణకు దక్కనివ్వకుండా చేస్తున్న ప్రధాని మోదీ కుట్రలో భాగమయ్యారు. న్యాయ విచారణ ప్రారంభమైన సమయంలో కాళేశ్వరంపై అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన విషపు రాతలకు పూనుకున్నారు. ‘కాళేశ్వరం కహానీ’ పేరుతో ఒక దినపత్రికలో వెదిరె శ్రీరాం రాసిన వ్యాసంలో.. తుమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీరు అందుబాటులో లేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) పేర్కొన్నదంటూ 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని, కానీ అక్కడ 165 టీఎంసీల లభ్యత ఉంటుందని అదే సీడబ్ల్యూసీ విస్పష్టంగా చెప్పిందని, అయినా బీఆర్ఎస్ సర్కారు అదే అబద్ధంతో ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేసి లొకేషన్ను మేడిగడ్డకు మార్చిందని ఆరోపించారు. వెదిరె శ్రీరాం చేసిన ఈ ఆరోపణ అవాస్తవం.
సీడబ్ల్యూసీ 2015 మార్చి 4న రాసిన లేఖలోని 12వ పేరాలో తన వాదనకు అనుకూలంగా ఉన్న కొంతభాగాన్ని మాత్రమే శ్రీరాం ఉటంకించారు. కానీ, వాస్తవంగా ఆ పేరాలోనే తుమ్మడిహెట్టి బరాజ్ ప్రతిపాదిత స్థలం వద్ద 75% డిపెండబులిటీ కింద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. అయితే, అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ర్టాలకు సంబంధించిన వాటాలు కూడా అంతర్భాగంగా ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా ఉన్నది. ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండే ఆయనకు ఇంగ్లిష్లో ప్రావీణ్యం లేదనుకోవాలా? లేక తెలంగాణ ప్రజలకు ఇంగ్లిషు రాదు, ఏం రాసినా చెల్లుతుందని ఆయన భావిస్తున్నారా? లేఖలోని 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందనే విషయాన్ని మాత్రమే తీసుకుని, సీడబ్ల్యూసీ దాని కొనసాగింపుగా ప్రస్తావించిన అంశాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు.
అదేమంటే బరాజ్ ప్రతిపాదిత స్థలం (తుమ్మిడిహెట్టి) వద్ద పై రాష్ర్టాల నుంచి లభ్యమవుతున్న అంచనా వరద జలాలు భవిష్యత్తులో కూడా లభ్యమవుతాయని కచ్చితంగా విశ్వసించలేం. ప్రాణహిత బరాజ్ నుంచి మొత్తంగా లభ్యమవుతాయనుకున్న జలాల నుంచి మళ్లించాల్సిన పర్యావరణ జలాలు (నదీ జీవ వైవిధ్య వ్యవస్థ సంరక్షణకు నదీ ప్రవాహంలో 20-30% జలాలను దిగువకు వదులుతూ ఉండాలి), పంపింగ్ సామర్థ్యం, బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం, దారిపొడవునా ఆయకట్టు ప్రాంతంలో ఉండే జలాశయాలు మొదలైన వాటిని ప్రాజెక్టు అధికారులు మరోసారి సమీక్షించుకోవాలని కేంద్ర జలసంఘమే ఆ లేఖలో చాలా స్పష్టంగా సలహా ఇచ్చింది. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్కు నిర్ణయం తీసుకున్నది.
కేసీఆర్పై బట్టకాల్చి మీదేసే యత్నం
ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయింది. ఇది కచ్చితంగా ఆ ప్రభుత్వ వైఫల్యమే అంటూ బీఆర్ఎస్పై వెదిరె శ్రీరాం చేసిన ఆరోపణలు పూర్తిగా కుట్రపూరితమైనవి. 2014 జూన్ 2న కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణ తొలి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో అధికారుల బృందం జూలైలోనే స్వయంగా మహారాష్ట్రకు వెళ్లారు. ఎఫ్ఆర్ఎల్ ఎత్తుపై చర్చించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న బరాజ్పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఆ తరువాత మహారాష్ట్రలో ఫడ్నవీస్ నేతృత్వంలో కొత్తగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడే ఆ రాష్ట్ర గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమనేత సీహెచ్ విద్యాసాగర్రావు నియమితులయ్యారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాసాగర్రావు సహకారంతో ఎలాగైనా నాటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ను తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి అంగీకరింపజేయాలని 2015లో కేసీఆర్ స్వయంగా తన పుట్టినరోజైన ఫిబ్రవరి17న మహారాష్ట్ర రాజ్భవన్లో ఫడ్నవీస్తో చర్చించారు. ఎంత నచ్చజెప్పినా 152 ఎఫ్ఆర్ఎల్ మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ అంగీకరించలేదు. ‘బరాజ్ ముంపు గ్రామాల్లో వ్యతిరేకంగా ఉద్యమించిన మేము ఎలా అంగీకరిస్తాం. మీరు ఎత్తును 148 మీటర్లకు తగ్గించుకుంటే సహకరించగలం’ అని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చిచెప్పారు.
ఆ రాష్ట్ర గవర్నర్గా విద్యాసాగర్రావు కూడా మహారాష్ట్ర సీఎంను ఒప్పించలేకపోయారు. ఆ తరువాత 15 రోజుల్లోనే ప్రస్తుతం వెదిరె శ్రీరాం ఉటంకిస్తున్న సీడబ్ల్యూసీ లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అందింది. ఇక 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే సుమారు 5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేది. ఇక 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలే ఉంటుంది. దానివల్ల ఆ ఎత్తులో లభ్యమయ్యే 102 టీఎంసీల నీటిని మొత్తాన్ని ఎత్తిపోయడం సాధ్యపడదు. సీడబ్ల్యూసీ లేఖలోని ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే కేవలం 44 టీఎంసీలకు మించి ప్రాణహిత నీటిని వినియోగించుకునే అవకాశమే లేదు. ఎఫ్ఆర్ఎల్ ఎత్తు 4 మీటర్లకు తగ్గించడం వల్ల అప్పటికే తవ్విన కాల్వల్లోకి నీటిని గ్రావిటీ ద్వారా తేవడం కూడా సాధ్యపడదు. కచ్చితంగా లిఫ్ట్ పెట్టాల్సిందే.
అంతేగాకుండా, తుమ్మిడిహెట్టి దగ్గ వార్ధా-వెయిన్గంగా నదులు కలిసే ప్రదేశంలో బరాజ్ నిర్మాణంలో క్షేత్రస్థాయిలో అనేక టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. స్క్యూషేప్లో బరాజ్ నిర్మించాల్సి వస్తుంది. ఆ డిజైన్తో ఇప్పటివరకు దేశంలో ఎక్కడా బరాజ్నే నిర్మించలేదు. బరాజ్ ప్రతిపాదిత స్థలం పక్కనే చాప్రాల్ అభయారణ్యంలోని రిజర్వ్ ఫారెస్టు ఉన్నది. ఆ భూమిని సేకరించడం అసాధ్యం. అనుమతులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇదిలాఉంటే, తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు లభ్యమైతేనే ప్రాజెక్టు ప్రతిపాదిత 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా అందులో నాల్గవ వంతు (44 టీఎంసీలు) నీటిని ఎత్తిపోసుకుంటే 4.5 లక్షల ఎకరాలకు మించి పారదు.
తెలంగాణలోని రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే కేసీఆర్ సంకల్పం.. తుమ్మిడిహెట్టి వద్ద లభ్యమయ్యే 102 టీఎంసీలతో, లేదంటే ఎగువ రాష్ర్టాలు వాడుకోకుండా వదిలేస్తే లభించే 165 టీఎంసీలతో నెరవేరబోదు. తెలంగాణకు ప్రాణహిత జలాలే ప్రాణధారం. నీరు లభ్యమయ్యేది కేవలం గోదావరి ప్రాణహిత సంగమస్థలం కాళేశ్వరం వద్దే అనే సత్యాన్ని ఇంజినీర్లు, సీడబ్ల్యూసీ ధ్రువీకరించిన తరువాతనే కాళేశ్వరం రీ డిజైనింగ్కు కేసీఆర్ నిర్ణయించారు.
తద్వారా ఎగువ నుంచి గోదావరికి, మంజీరా నదికి నీటి ప్రవాహాలు రానందున ప్రాణహిత నీటితోనే నిజాంసాగర్, సింగూర్, శ్రీరాంసాగర్ రెండు దశలు, వరదకాల్వ, అప్పర్మానేరు వంటి ప్రాజెక్టులను పునరుజ్జీవనం చేసి లక్షలాది ఎకరాల్లో రెండు పంటలు పండించాలని కేసీఆర్ సంకల్పించారు. అందుకోసమే తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ను మేడిగడ్డకు మార్చారు. ఇక రీ డిజైనింగ్ ఇంజినీర్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చేసిందే తప్ప కేసీఆర్ చేయలేదు.
తెలంగాణ ఏర్పడేనాటికే సుమరు 35 వేల మంది రైతులు సాగునీరు లేక, లక్షలాది బోర్లు అడుగంటి మళ్లీ బోర్ల తవ్వకం కోసం అప్పులు చేసి, అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నది చూసి తెలంగాణ రైతుల తలరాతను మార్చడానికి తానే ఉద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టి ఎంతో సౌకర్యవంతమైన ఉపసభాపతి, ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి పదవులను త్యజించిన కేసీఆర్పై బట్టకాల్చి మీదవేసేందుకే వెదిరె శ్రీరాం పసలేని ఆరోపణలు చేస్తున్నారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించలేదని కేసీఆర్ను ప్రశ్నిస్తున్న వెదిరె శ్రీరాం, మరి అంతకుముందు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేదని మాత్రం ప్రశ్నించడం లేదు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్రతోపాటు అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అప్పుడు సాధ్యం కానిది తెలంగాణలో బీఆర్ఎస్, మహారాష్ట్ర, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నపుడు ఎలా సాధ్యమవుతాయి? మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న విద్యాసాగర్రావు తెలంగాణ బిడ్డగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల్లో తన వంతు మాట సాయం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాం ఏం చేశారు? అప్పుడు మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేదని ఎందుకు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ను ఎందుకు తప్పుపట్టడం లేదు? అంటే కేవలం ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసమే.
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్న దరిమిలా వాళ్లకు ఒత్తాసు పలుకుతూ కథనాలను వండి వారుస్తున్నారు. ఇచ్చంపల్లికి రేవంత్ ప్రభుత్వం మార్గం సుగమం చేస్తుందనే వ్యూహంతో వెదిరె శ్రీరాం కథనాలు రాస్తున్నట్టుగా అర్థమవుతున్నది. అంటే ఇందులో ఎక్కడా తెలంగాణ ప్రయోజనాల కోణం అనేది లేదని, కేవలం ప్రాజెక్టులు, పనులు.. అనే కోణమే అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
జియోటెక్నికల్ సర్వే చేయలేదనడం అవాస్తవం
అన్నారం, సుందిళ్ల బరాజ్లకు జియో టెక్నికల్ సర్వే జరపలేదని, అవి లేకుండానే బరాజ్ల నిర్మాణ స్థలాలను మార్చారని వెదిరె శ్రీరాం చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. సర్వేలు చేసిన అనంతరమే బరాజ్ల నిర్మాణ స్థలాలను మార్చారు. ఆ సర్వేలను కూడా వ్యాప్కోస్ సంస్థనే నిర్వహించింది. సర్వే కోసం ఒక్కో బరాజ్ వద్ద 8-9 బోర్హోల్స్ తవ్వితే రా్రష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్లు 30-40 బోర్హోల్స్ తవ్వినట్టు రుజువులు ఉన్నాయి.
రైతుల ఆత్మహత్యలను ఆపడానికి వీలైనంత త్వరగా ప్రాజెక్టులను నిర్మించాలని కేసీఆర్ తండ్లాడిండే తప్ప, నిర్మాణాలను సత్వరమే పూర్తిచేయడానికి వాటి నాణ్యతను గాలికి వదిలేయమని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను ఆదేశించలేదు. గతంలో తెలంగాణలో నిర్మించినవన్నీ డ్యామ్లే తప్ప ఇలాంటి బరాజ్లు కావు. డ్యామ్ల నిర్మాణంలో సీడీవో డిజైన్లను పూర్తిచేయడానికి ఏండ్లకేండ్లు తీసుకునేది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ కూడా వెనకటి కాలంలో లేకుండె. తెలంగాణ సీడీవోకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఈ సీడీవో అప్రూవ్చేసిన డిజైన్లను పరిశీలించాల్సిన అవసరమే లేదని సీడబ్ల్యూసీ ఏనాడో స్పష్టం చేసింది. అయినా కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల డిజైన్లతోబాటు వివిధ నిర్మాణాల డిజైన్లను ఎప్పటికప్పుడు కేంద్ర జలసంఘం పరిశీలించి సూచనలు చేసింది. వాటిని అమలు చేస్తూ కాళేశ్వరం డిజైన్లకు సీడీవో తుది రూపం ఇచ్చింది.
ఇచ్చంపల్లి కోసమే వెదిరె ఆరోపణలు
వెదిరె శ్రీరామ్ బాధంతా ఇచ్చంపల్లి బరాజ్ కోసమే. ఇచ్చంపల్లి బరాజ్ కట్టాలని తన పుస్తకంలో సలహా ఇస్తే, కేసీఆర్ దానిని పక్కనపెట్టి మేడిగడ్డ వద్ద బరాజ్ను నిర్మించారు. అందుకే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. నదుల అనుసంధానం ద్వారా ఇచ్చంపల్లిపై తన వ్యక్తిగత మక్కువను వెదిరె శ్రీరాం నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. కానీ, అది కూడా సాధ్యపడదు.
ఇప్పటికే నిర్మించిన మేడిగడ్డ బరాజ్ని సత్వరమే పునరుద్ధించాలని కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచించారు. తెలంగాణ పోరుగడ్డ వరంగల్లో జన్మించిన వెదిరె శ్రీరామ్.. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా తన పలుకుబడిని తెలంగాణ రైతుల మేలు కోసం వినియోగిస్తే ఆయన పేరు, ఉద్యమ చరిత్ర నాలుగు కాలాలపాటు నిలుస్తుంది. కాళేశ్వరం లాంటి ప్రపంచఖ్యాతి గడించిన ప్రాజెక్టుపై విషం చిమ్మితే ద్రోహుల చరిత్రలో ఆయన పేరు కూడా చేరుతుంది.
అనేక దఫాలుగా మాడల్ స్టడీస్
బరాజ్ల నిర్మాణాలకు ముందు టీఎస్ఈఆర్ఎల్ (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరి ) మాడల్ స్టడీస్ చేయలేదనే వెదిరె శ్రీరాం ఆరోపణ పచ్చి అబద్ధం. మాడల్ స్టడీస్ను 2016 అక్టోబర్లో మొదటిసారిగా, ఆ తరువాత 2017, 2018లో, చివరగా 2019లో కూడా నిర్వహించారు. 2018 నుంచి టీఎస్ఈఆర్ఎల్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాలంతరి పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ కాలంలోనే నేనే చైర్మన్గా ఉన్నాను.
కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న కేసీఆర్ పొరుగు రాష్ర్టాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఫడ్నవీస్తో కలిసి ప్రారంభించారు. 2019 యాసంగి పంటలకు తొలిసారి కాళేశ్వరం నీటిని అందించారు. 2020 మార్చి నుంచి సుమారు రెండేండ్లపాటు కరోనా మహమ్మారిలా దాడి చేయడంతో ఇంజినీర్లు కరోనా బారిన పడటం, కాంట్రాక్టు పనులు నిలిచిపోవడం తదితర కారణాల రీత్యా ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం) పనుల్లో ఇబ్బందులు తలెత్తాయి.
ఆ కారణం వల్ల ప్రారంభంలో బరాజ్ల వద్ద రిపేర్లు సరైన సమయంలో చేపట్టలేదు. ఇక మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాకులోని పిల్లర్లు కుంగడానికి కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. విచారణ ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే ఇంజినీరింగ్ పరిజ్ఞానం లేని వెదిరె శ్రీరాం ‘షీట్పైల్స్కు బదులు సీకెంట్పైల్స్ వేయడం, వాటిని తొలగించకపోవడం’ అంటూ ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సీకెంట్పైల్స్ నిర్మాణాలు మన దేశంలో ఎక్కువగా వినియోగించకపోవచ్చు కానీ, ప్రపంచానికి కొత్తేమీ కాదు.
వరదాయిని కాళేశ్వరం
ఆంధ్రజ్యోతిలో వెదిరె శ్రీరాం రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు వీ ప్రకాశ్ కౌంటర్