వీణవంక, మార్చి 8: కరీంనగర్ జిల్లా వీణవంక తహసీల్దార్ తిరుమలరావుపై సస్పెన్షన్ వేటుపడింది. ధరణి నిబంధనలకు విరుద్ధంగా భూమిని రిజిస్ట్రేషన్ చేశాడనే కారణంతో కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీణవంకకు చెందిన రామిడి శివప్రియకు సర్వేనంబర్ 1224/ఏలో ఆరు గుంటలు, 1230/21లో 16 గుంటల భూమి ఉన్నది. అయితే ఆమె అమెరికాలో ఉంటున్నారు.
ఆమెకు తెలియకుండా వీణవంకకు చెందిన సుకాసి సురేశ్ పేరిట పట్టా చేశారు. ఇందులో శివప్రియ లేకుండానే ఆమె ఫొటోతో సేల్డీడ్ చేశారు. ధరణి ఆపరేటర్ అరుణ్చౌదరి, సుకాసి సురేశ్, సాక్షులు నీల పున్నం చందర్, అక్బర్ కుమ్మక్కై తాను ఎన్నికల విధుల్లో ఉండగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తహసీల్దార్ తిరుమలరావు ఇటీవల ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికారులు విచారణ జరిపి ఈ వ్యవహరంలో తహసీల్దార్ తప్పిదం ఉన్నదని తేలడంతో తిరుమల్రావును సస్పెండ్ చేశారు.