గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చినా ఓటమి తప్పదని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థికి ఇక్కడ కనీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్లో ఇక ఆటలు సాగవని తెలుసుకొన్న ఈటల గజ్వేల్ వైపు చూస్తున్నట్టు తెలిపారు. గజ్వేల్ కాకుండా మరోసారి హుజూరాబాద్లో గెలిచి ఉనికి చాటుకోవాలని ఈటలకు సవాల్ విసిరారు. గజ్వేల్ ప్రజలు చైతన్యవంతులని, అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్ వెంటే ఇక్కడి ప్రజలు ఉంటారని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ కండువా వేసుకొన్న ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈటల ఓడించలేడన్నారు. ఆస్తులను కాపాడుకొనేందుకే ఈటల బీజేపీ పంచన చేరి ఆ పార్టీ కండువా వేసుకొని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధుల గురించి ఒక్కసారి ప్రజలకు వెల్లడించగలవా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఓటమి భయం పట్టుకొన్నదని, అందుకే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నాడని వంటేరు ప్రతాప్రెడ్డి ఎద్దేవా చేశారు. గజ్వేల్ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులపై ఈటల కన్నేసి దోచుకొనేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడని ఆరోపించారు. కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఈటల, తన ఆస్తులు కాపాడుకోవడానికి మతతత్వ బీజేపీతో కుమ్మక్కైనట్టు స్పష్టమవుతుందన్నారు. పేద ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్న ఈటల రాజేందర్ ఏ ముఖం పెట్టుకొని గజ్వేల్లో అడుగు పెడతారని ప్రశ్నించారు.