ముషీరాబాద్, నవంబర్ 8: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోదీ, రామగుండం వస్తే రణరంగంగా మారుతుందని చెప్పారు. మంగళవారం విద్యానగర్లో మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, లైంగికదాడులు జరుగుతున్నా పట్టించుకోని బీజేపీ, దళితులను అవమానిస్తూ వివక్ష ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్టుగానే యూనివర్సిటీ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, తిరుమలేశ్, శ్రీకాంత్, నాగరాజు, కానుగంటి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.