ముషీరాబాద్, అక్టోబర్ 4: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసగించిన బీజేపీని మట్టికరిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దశాబ్దకాలంగా మోసం చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పడానికి భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
హైదరాబాద్ విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకణ కోసం మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం మాదిగలను వాడుకొని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, తిరుమలేశ్, జీవన్, శ్రీకాంత్, కార్తీక్ పాల్గొన్నారు.