మహబూబాబాద్ : వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో గత 50 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 400 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలలో ఉతీర్ణత సాధించేందుకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మార్గదర్శకంలో 2006 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వందేమాతరం ఫౌండేషన్ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా… నిలిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తున్నారు.
ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి శిక్షణ తీసుకుని 700 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్లడం మామూలు విషయం కాదన్నారు. 14 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీలో చేరడం అసాధారణమని పేర్కొన్నారు.కరోనా నుంచి కోలుకోలేని ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యా పరంగా నష్టపోయిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ బాసటగా నిలిచిందన్నారు.
అత్యంత నిజాయితీతో సేవానిరతిని చాటుకుంటున్నందుకు ఫౌండేషన్ను, నిర్వాహకుడు రవీందర్ రావుని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా తల్లి దండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే తమ తల్లి దండ్రులను, పెద్దలను అనాథ, వృద్ధాశ్రమాలకు పంపించబోమని, బాగా చూసుకుంటామని పిల్లల చేత ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయించారు.