దేవరుప్పుల, జూన్ 26 : వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ అభిమాని, ఎన్నారై సురభి శ్రీనివాస్ ఇంట్లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి హాజరైన ఎర్రబెల్లి అక్కడి భక్తులకు కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దేవాలయాల అభివృద్ధిని వివరించారు. రూ.వందల కోట్లతో నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు.
ప్రముఖ శైవకవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి, కవి పోతన జన్మించిన బమ్మెర, వాల్మీకి రామాయణం రాసిన విశిష్ట స్థలం వల్మిడి మునులగుట్టను తాను మంత్రిగా ఉన్న సమయంలో రూ. వంద కోట్లతో అభివృద్ధి చేశామని వివరించారు. ఈ మూడింటిని కలిపి ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్గా చేసేందుకు నిధు లు కేటాయించగా, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి చరిత్రను వివరించారు.