ఉప్పల్ ( హైదరాబాద్) : దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాలకు వేల కోట్ల విలువ చేసే స్థలాలు కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు (Vakulabharanam) అన్నారు. బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నింపిన సీఎం కేసీఆర్( CM KCR ) కు ఆయా వర్గాలు రుణపడి ఉంటాయన్నారు.
ఉప్పల్ భగాయత్లో వడ్డెర కులానికి ఒక ఎకరం, సంచార జాతులకు కేటాయించిన స్థలాల్లో భవన నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ (BC) లు సంఘటితంగా ఉంటూ ఐక్యతను చాటలన్నారు. కుల సంఘాలలో ఐక్యత దెబ్బతీసేవారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ రంగానికి వార్షిక బడ్జెట్ (Budget) లో 40 శాతం నిధులు కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు (Welfare Schemes) తీసుకువచ్చారని పేర్కొన్నారు. సంక్షేమానికి విఘాతం కలిగించేవారితో అప్రమత్తంగా ఉండాలని, బీసీలు హక్కులను కాపాడుకుంటూ, జాతి అభ్యున్నతికి కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిశోర్గౌడ్, అధికారులు అలోక్కుమార్, డి.శ్రీనివాస్రెడ్డి, సంఘం నేతలు ఆలకుంట హరి, ఎత్తరి అంతయ్య, సత్యనారాయణ రాజు, వెంకటస్వామి, మహంకాళి భూపతికుమార్, మొగిలి వెంకటస్వామి, మురారి, వంశరాజ్ మల్లేష్, నరహరి పాల్గొన్నారు.