హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. వద్దిరాజుతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసిన్నప్పటికీ, ఆ రెండూ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురయ్యాయి. వద్దిరాజు నామినేషన్ ఒక్కటే సక్రమంగా దాఖలు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి పాల్గొన్నారు. వద్దిరాజు రవిచంద్రను పలువురు ప్రజాప్రతినిధులు, మున్నూరుకాపు కుల సంఘాల ప్రతినిధులు, వద్దిరాజు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరమల్ల ప్రకాశ్, మెట్టు శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఏనుగు చంద్రయ్య, బండి కుమారస్వామి, కూసం శ్రీనివాస్ తదితరులు వద్దిరాజును అభినందించారు.