హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. వద్దిరాజుచే ప్రమాణం చేయించారు. ఎంపీగా రెండోసారి వద్దిరాజు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయటం గమనార్హం.
పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ వైస్చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీకే మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వద్దిరాజుకు పలువురు ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసంతో రెండోసారి రాజ్యసభకు పంపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వద్దిరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా పనిచేస్తానని వద్దిరాజు పేర్కొన్నారు.