రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలు టాప్
హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలు వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి డోసు పంపిణీలో ఈ మూడు జిల్లాలు 100% లక్ష్యాన్ని చేరుకున్నాయి. అతి తక్కువ డోసులు పంపిణీ చేసిన జిల్లాల జాబితాలో వికారాబాద్, వరంగల్, నల్లగొండ, జోగులాంబ గద్వాల ఉన్నాయి. రెండో డోసు పంపిణీలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాలు ముందంజలో కొనసాగుతుండగా.. నారాయణపేట జిల్లా చివరి స్థానంలో నిలిచింది. వికారాబాద్, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలు కూడా వెనుకబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల మంది అర్హులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో ఇప్పటివరకు 72% మంది తొలి డోసు, 39% మంది రెండు డోసులు తీసుకున్నారు. టీకాల పంపిణీ తక్కువగా నమోదైన జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.