హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నీరా కేఫ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీ డియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కులవృత్తులను ఆదుకోవడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నీరా కేఫ్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గత రెండున్నరేండ్లుగా నీరా కేఫ్లను అసలే పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. స్వచ్ఛంగా అందించాల్సిన నీరా కేఫ్లను ప్రైవేట్పరం చేసేలా ప్రణాళికలు రూపొందించడం దుర్మార్గమని పేర్కొన్నారు. నీరా కేఫ్లను నడిపించడం రాకపోతే.. ఎలా నడపాలో తమను అడిగితే చెప్పేవాళ్లం కదా? అని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ నీరా కేఫ్లను కాపాడుకొనే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్కు కట్టపెడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కేఫ్ల వల్ల 10 కులాల వారికి పనులు దొరుకుతాయని గుర్తుచేశారు. నీరాకేఫ్ల ఏర్పాటుకోసం నందనంలో వందశాతం పూర్తయినా నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించడమే లేదని విమర్శించారు. ఇంతకు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారా? లేరా? అన్న అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని కులవృత్తులను విధ్వంసం చేయడమే కాంగ్రెస్ సర్కార్ పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. అన్ని కులవృత్తులపై దాడి చేస్తూ విచ్ఛిన్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల కులవృత్తులను కాపాడుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కుల వృత్తిదారులకు ఎన్నో హామీలిచ్చినా, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 1.50 కోట్ల తాటి చెట్లను బీఆర్ఎస్ హయాంలో నాటినవేనని గుర్తు చేశారు. ఎన్నికల ముందు గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చి.. నేడు మరిచిందని దుయ్యబట్టారు. రూ.20 కోట్ల మేర గీత కార్మికుల ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. ఆ డబ్బులు చెల్లించడానికి కూడా కమీషన్లు కావాలా? అని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నాగేంద్రగౌడ్, పల్లెరవికుమార్, సీహెచ్ ఉపేంద్ర, కిశోర్గౌడ్ పాల్గొన్నారు.