హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించడంలో తామంతా కేసీఆర్తోనే ఉన్నామని తెలిపారు. పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్యపు పంటను పండించగలమని అభిప్రాయపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ దద్దరిల్లేలా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ చేసిన దీక్షపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది.
రైతు సంఘాల నాయకులతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ దీక్షకు, రైతు సమస్యలపై పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలేశ్యాదవ్ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, దిగజారుడు వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాకు కూర్చోవడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నది. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే బీజేపీ విధానాలను వ్యతిరేకించడంలో మేమంతా ఒక్కటే. పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్యపు పంట పండిద్దాం’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.