బొడ్రాయిబజార్, ఏప్రిల్ 3 : రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు కీలకమని, బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక రెడ్హౌస్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. సిట్టింగ్ ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నాయకులను ఎలాంటి ఆధారాలూ లేకుండా ఈడీ పేరుతో అణచివేస్తున్నదని ధ్వజమెత్తారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. బీజేపీ సర్కారు కేవలం మతపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధిపొందిందని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, ఉన్న ఆదాయాన్ని సగానికి తగ్గించిందని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ వల్ల నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. ఖాజీపేట రైల్వే పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు.