Uttam Kumar Reddy | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): తనతోపాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే ఉన్నదన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో ఇటీవల రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ తొలిసారి స్పందించారు. గాంధీభవన్లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఉత్తమ్ వద్ద ప్రస్తావించగా, వాటిని తాను సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ 14 సీట్లు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతుతో ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతు నష్టపోతే, వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యానికి మిల్లర్లు ఎక్కడైనా తరుగుతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం 2.25 టీఎంసిల నీళ్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. మేడిగడ్డ బరాజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదిక ఇచ్చిందని, వారం పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నదని తెలిపారు.