Uttam Kumar Reddy | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుబంధు ఇవ్వడం దుబారా ఖర్చని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్మును, పన్నుల ద్వారా కట్టే పైసలను కేసీఆర్ రైతులకు రైతుబంధు రూపంలో ఇస్తూ దుబారా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఇప్పటికే రైతుబంధును ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. తాజాగా రైతుబంధు పథకంపై ఉత్తమ్కుమార్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. పంట పెట్టుబడికి రంది లేకుండా చేసిన రైతుబంధు పథకంపై కాంగ్రెస్ నేతలు విషం కక్కుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడమే పాపమన్నట్టుగా, ఉత్తమ్ మాట్లాడారని, రైతులకు సాయం అందించాల్సిన అవసరం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. రైతులకు పెట్టుబడిగోస తీరుస్తున్న రైతుబంధు పథకాన్ని ఓర్వలేకనే అది దండగ అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ వస్తే రైతుబంధు బందా?
‘తమకు ఎంతగానో ఉపయోగపడుతూ.. పంట పెట్టుబడికి రంది లేకుండా చేసిన రైతుబంధు పథకం దుబారా ఖర్చు ఎలా అవుతుంది? రైతులకు చేసే సాయం.. వృథా ఖర్చు అవుతుందా?’ అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రైతులు విమర్శిస్తున్నారు. రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీతో పాటు నేతల మాటలు, వ్యవహార శైలి చూస్తుంటే.. ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు తీసేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పంపిణీని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఆ మరుసటి రోజే.. ఆ పార్టీ నేత రైతుబంధుపై విషం కక్కడం రాష్ట్ర రైతాంగం అనుమానాలను బలపరుస్తున్నది.
మరి ఆరు గ్యారెంటీల్లో ఎందుకు పెట్టినట్లు…
రైతుబంధు దుబారా ఖర్చు అయినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసాని ఎందుకు పెట్టిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇది కేవలం ఎన్నికల స్టంటేనా అని నిలదీస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ పథకాన్ని నిలిపేస్తారా లేదా అన్నదానిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.