CM KCR | దేశ రైతాంగానికి సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు.. అందుకే మనం…అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నం. రైతు సమస్యల పరిష్కారానికి రైతుల్లో ఐక్యత రావాలె.
– సీఎం కేసీఆర్
తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు కాకముందు మహారాష్ట్ర కన్నా ఘోరంగా వుండేవి ఇక్కడి పరిస్థితులు. ఇక్కడ కూడా రైతుల ఆత్మహత్యలుండేవి. కానీ రాష్ట్రం ఏర్పాటైనంక ఒక దారి దొరికింది. నేడు రైతుల ఆత్మహత్యలు జీరో అయినవని నేను గర్వంగా చెప్పగలను.
నడి ఎండల్లోనూ మాకు నిండుగ నీళ్లు
ఏప్రిల్ నడి ఎండల్లో కూడా తెలంగాణ చెరువులు, కాలువల నిండా నీళ్లున్నయి. ఎట్లున్నయి మరి? తెలంగాణలో హిమాలయాలున్నయా? మరి నీళ్లెక్కడినుంచి వచ్చినయి? హిమాలయాలు లేవు కానీ.. హిమాలయాలకన్నా ఎత్తయిన సంకల్పం ఉన్నది కాబట్టే తెలంగాణలో నీళ్లు వచ్చినయి.
రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే రైతు సమస్యల పరిష్కారం సాధ్యం. రైతుల సమస్యలను కేవలం రైతులే పరిష్కరించుకోగలరు.
గతంలో మహారాష్ట్రలో షేత్కరీ కామ్గార్ పార్టీ.. 76 సీట్లు గెలిచింది. మనం ఇప్పుడు 200 సీట్లు గెలుస్తం.
దాల్ మే కుచ్ కాలా హై..
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు తదితర అన్ని రకాలుగా రైతుకోసం తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న మొత్తం ఖర్చు 4.5 లక్షల కోట్లు. తెలంగాణ బడ్జెట్ కన్నా మహారాష్ట్ర బడ్జెట్ పెద్దది. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతు కోసం పనిచేయదు? అంటే.. దాల్ మే కుచ్ కాలా హై.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రైతుకు రాజ్యాధికారం తేవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే వెలుగు జిలుగులతో మహారాష్ట్రను దేదీప్యమానం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్ కావాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మహారాష్ట్రకు చెందిన షేత్కరీ సంఘటనకు చెందిన వందల మంది నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మహారాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలు, తెలంగాణ విజయగాథను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ యోగ్యమైన భూమి మనదేశంలో ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘విస్తీర్ణంలో అమెరికా మనకన్నా రెండున్నర రెట్లు పెద్దది. అయినా, అక్కడ 29 శాతం భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలం. చైనా మనకన్నా ఒకటిన్నర రెట్ల పెద్దగా ఉన్నా అక్కడ 16 శాతం భూమి మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నది. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా సాగు యోగ్యమైన భూమి భారత్లోనే ఉన్నది. దేశంలో మొత్తం 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే, 41 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉన్నది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అద్భుత వాతావరణ మనకే ఉన్నది. బ్రహ్మాండంగా భూమి ఉన్నది. నదుల్లో కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయి. 140 కోట్ల మానవ వనరులున్నాయి. మూడు రకాల శీతోష్ణస్థితులగల మనదేశంలో మామిడి పండ్లు పండుతాయి. ఆపిల్ పండ్లు పండుతాయి. ఇది కేవలం భారతదేశానికే సొంతం. దేశంలో మన అవసరాలకు మించి నీటి వనరులున్నాయి. ఏటా లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తున్నది. ఇందులో 50 శాతం ఆవిరైపోయినా, 70 వేల టీఎంసీల నీరు నదుల్లో పారుతున్నది. ఇప్పటిదాకా ఘనత వహించిన పాలకులు, మైకులు పగిలేలా ఉపన్యసించే ప్రధానులు, జలశక్తి మంత్రులు, వ్యవసాయ మంత్రులు, సీఎంలు, ట్రిబ్యునళ్లు, మహా మహానేతల అద్భుత ఆలోచనలు, ఆచరణతో దేశంలో మనం వాడుతున్న నీరు కేవలం 19 వేల టీఎంసీలు. ప్రకృతి ఇచ్చిన 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలువుతున్నది. నీరు సముద్రం పాలు కావాలా? ఎండిన బీళ్లను తడుపాలా? తేలాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.
దేశంలో శక్తియుక్తులున్న రైతులుండి, సారవంతమైన భూమి ఉండి, పుష్కలమైన నీరుండి, సూర్యరశ్మి ఉండి, 140 కోట్ల మంది ప్రజలున్నా మన బిడ్డలు మెక్డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన ఖర్మ ఎందుకని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మన జొన్నరొట్టె ముందు పిజ్జా ఎంత? అని అన్నారు. ‘రైతుల బతుకులు మారాలని చిత్తశుద్ధితో, పట్టుదలతో ఆలోచించే ప్రధానులు, సీఎంలు ఉంటే మన ఉత్పత్తుల కోసం ప్రపంచమే ఎదురుచూసేలా విధానాలు రూపొందించుకోవచ్చు. అందుకోసం భూభౌతిక, పంట కాల స్థితులకు అనుకూలంగా ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. దురదృష్టవశాత్తు ఇప్పటిదాకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విజయ డెయిరీని సర్వనాశం చేశారు. కానీ ఇప్పుడది సగర్వంగా నిలబడింది. మహారాష్ట్రలోనూ విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యికి మంచి గిరాకీ ఉన్నది. మహారాష్ట్రలో కష్టపడి పనిచేసే రైతులు, అద్భుతమైన భూమి, పశుసంపద ఉన్నది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దుకోగల సత్తా వారికి ఉన్నది. మహారాష్ట్ర రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగునింపే బాధ్యత నాది. తెలంగాణలో పథకాలు అమలు చేయడం సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు? తెలంగాణ రైతులు బాగుపడ్డట్టు మహారాష్ట్ర రైతుల జీవితాలు మారకూడదా? మహారాష్ట్ర కన్నా తెలంగాణ చిన్న రాష్ట్రమే కాకుండా పేదరాష్ట్రమే అయినా ఇప్పుడు మెరుగుపడ్డాం. మహారాష్ట్ర సర్కార్ ఖజానా పెరగకపోవటం వెనుక పెద్ద మతలబు ఉన్నది. ఖజానాలోఎలుకలు పడ్డాయి. వాటిని దొరకబట్టి తీరుతాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
మహారాష్ట్రలో గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి ఇలా దాదాపు ప్రతీ జిల్లాలో చిన్నవో పెద్దవో నదులు ప్రవహిస్తున్నా సాగు, తాగునీటి కోసం కష్టాలెందుకు?
– సీఎం కేసీఆర్
మహారాష్ట్ర లాగా సముద్రతీరం లేకున్నా, ఆర్థిక వనరులు ఆస్థాయిలో లేకున్నా తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, అది కండ్ల ముందే కనిపిస్తున్న సత్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో తొలి బడ్జెట్ రూ.62 వేల కోట్లు. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు చేరింది. తలసరి ఆదాయంలో మొదట్లో తెలంగాణ కింది వరుసలో ఉండేది. ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా ఇలా అనేక రాష్ర్టాలను అధిగమించింది. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 అని రెండుమూడు రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ప్రకటించింది. ఇలాంటి మార్పు మహారాష్ట్రలోనూ రావాలి. అందుకోసం మనమంతా కలిసి పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు.
ధరణి పోర్టల్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు భూమిని రైతు మాత్రమే మార్చుకోగల విధానాన్ని రూపొందించామని, దాన్ని కలెక్టర్ నుంచి మొదలుకొంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మార్చలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఆ రికార్డును చెరిపివేయలేడని తెలిపారు. రికార్డులన్నీ కంప్యూటరైజ్ చేశామని చెప్పారు. కాళ్ల చెప్పులరిగేలా తిరిగినా గతంలో పని కాకపోయేదని, నేడు ధరణివల్ల రైతులు సంవత్సరాల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్ధా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి ఇలా దాదాపు ప్రతీ జిల్లాలో చిన్నవో పెద్దవో నదులు ప్రవహిస్తున్నా సాగు, తాగునీటి కోసం కష్టాలెందుకు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి కారణం ఎవరు అని నిలదీశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మాటలు తప్ప చేతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నామని స్పష్టం చేశారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం నిజం కావాలంటే రైతుల చేతిలోనే రాజ్యాధికారం ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రైతుల జీవితాలు మారాలంటే వారి చేతుల్లోనే అధికారం ఉండాలి. ఇది సాధ్యమే. దేశ ఆర్థిక వ్యవస్థలో 42 శాతం వాటా రైతులది. రైతులు, రైతు అనుబంధ రంగాలపై ఆధారపడ్డ వారు ఇలా మొత్తం దేశంలో దాదాపు 50 శాతం మంది ఉంటారు. దేశంలోని రైతులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యత ప్రదర్శిస్తే రైతుల చేతికి అధికారం రాదా? రైతుల చేతికి అధికారం వస్తే రైతుకు కావలసిన విధంగా పాలన ఉంటుంది. రైతులు ఎందులోనూ తక్కువ కాదు. రైతులు మహారాష్ట్రను, దేశాన్ని పాలించలేరా? ’ అని నిలదీశారు.
దేశంలో శక్తియుక్తులున్న రైతులుండి, సారవంతమైన భూమి ఉండి, పుష్కలమైన నీరుండి, సూర్యరశ్మి ఉండి, 140 కోట్ల మంది ప్రజలున్నా మన బిడ్డలు మెక్డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన ఖర్మ ఎందుకు? మన జొన్నరొట్టె ముందు పిజ్జా ఎంత?
– సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఒక్క అడుగు వేస్తేనే రైతులకు అక్కడి ప్రభుత్వం రూ.6 వేల సహాయాన్ని ప్రకటించింది. అదే రైతులే రాజకీయ శక్తిగా ఎదిగితే పరిస్థితులు మారిపోతాయి. భిక్షమేసినట్టు ఆరు వేలు ఎందుకు? పది వేలు ఇవ్వాల్సిందే. దేవేంద్ర ఫడ్నవీస్కు లోహా వేదికగా సవాల్ విసిరినం. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో తెస్తే నేను ఆ తర్వాత మహారాష్ట్రకు రాను. మహారాష్ట్ర రైతులకు తెలంగాణ మాడల్ అమలు ఒక్కటే చాలు. అంతకన్నా ఏమీవద్దు. దీనిని అమలు చేసేదాకా నేను మహారాష్ట్రకు వస్తూనే ఉంటాను’ అని స్పష్టంచేశారు.
తెలంగాణ మాడల్ అమలుకు చిత్తశుద్ధితో.. నిజాయితీతో వజ్రసంకల్పం చేబూనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తామనే దృఢమైన ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగాలన్నారు. నిజాయితీతో చిత్తశుద్ధితో అడుగులు వేస్తే విజయాన్ని తప్పక ముద్దాడుతామన్నారు. విజయం సాధించాలంటే ‘డంగ్ చాహియే… రంగ్ చాహియే.. జంగ్ చాహియే’ అని పిలుపునిచ్చారు.
మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనే ఆలోచన ప్రతీ ఒక్కరూ చేయాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు. ‘నిత్యం వేలాది మందితో ఆందోళనలు అదేపనిగా ఎంతకాలం చేస్తాం? వాటి వల్ల ఫలితం ఉండదు. ఒకవైపు పోరాటం మరోవైపు ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి ఓటు అనే ఆయుధంతో తేవాలి. పోరాట పంథా మార్చాలి. రైతుల్లో ఐక్యతను సాధించేందుకు కృషి చేయాలి. దేశంలో రైతులు 75 ఏండ్ల నుంచి ఆందోళనలు, పోరాటాలు చేసినా ఈ పాలకులకు ఉలుకురావటం లేదు. మరో 75 ఏండ్లు పోరాటం చేసినా ఇదే ఫలితం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మన చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమైన ఓటును వినియోగించుకొని రైతు రాజ్యం తెచ్చుకోవాలి. రోడ్ల మీద ఆందోళనలు.. పోరాటాలు చేయాల్సిన అకర లేదు. లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. తూటాలకు గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదు. వజ్రాయుధమైన మన ఓటును మనమే వాడుకుంటే రైతు రాజ్యం పక్కాగా సిద్ధిస్తుంది’ అని అన్నారు. ఉద్యమాలు చేయటంతోపాటు ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ తమ నిర్ణయాన్ని తప్పుబట్టారని, కానీ పార్లమెంట్ చట్టం ద్వారానే తెలంగాణ సాధించలమని, అందుకోసం ఎన్నికల్లో పోటీచేయాల్సిందేనని బయలుదేరిన సందర్భాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా కాకుండా కేవలం రోడ్లపై పోరాటాలు చేస్తే ఎన్నేండ్లు అయినా తెలంగాణ రాకపోయేదన్నారు. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించామని, ఒక నెత్తురు చుక్క రాలకుండా పూర్తి శాంతియుత పంథాలో ప్రజాస్వామ్యయుతంగా రాష్ర్టాన్ని సాధించిన విషయాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘మహారాష్ట్రలో గతంలో ‘షెత్కరీ కామ్గారి పార్టీ’ పోటీ చేసి మహారాష్ట్రలో 76 సీట్లు గెలిచింది. మరో 76 సీట్లు గెలిస్తే ఎట్లుంటదో ఆలోచించండి’ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 200 సీట్లు గెలుస్తం. అందుకు గట్టి సంకల్పం కావాలె’ అని స్పష్టం చేశారు.
రోడ్ల మీద ఆందోళనలు.. పోరాటాలు చేయాల్సిన అకర లేదు. లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. తూటాలకు గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదు. వజ్రాయుధమైన మన ఓటును మనమే వాడుకుంటే రైతు రాజ్యం పక్కాగా సిద్ధించడం తథ్యం.
– సీఎం కేసీఆర్
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని, కరెంట్ చార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా తాము తలొగ్గలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ట్రాన్స్ఫార్మర్లకు, సబ్స్టేషన్లకు మీటర్లు పెట్టాలని చూశారన్నారు. ‘చంద్రబాబు తెలంగాణ ప్రజలందరికీ మీటర్లు పెడితే అందరి దగ్గరున్న కరెంట్ ఒక్కచోట నీకే మీటరు పెడ్తరు’ అని హెచ్చరించారు.
వెయ్యి కిలోమీటర్ల (967) సరిహద్దును పంచుకుంటున్న మహారాష్ట్రకు తెలంగాణ సాధించిన విజయం తెలుసని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత ఏం జరిగిందో తెలుసని, దేశంలో రైతుల కష్టాలు తీరాలని చిత్తశుద్ధితో మనం చేస్తున్న పోరాటం సంపూర్ణ విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. దేశ రైతాంగం మేలు కోసం శరద్జోషి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.
నరేంద్రమోదీ కన్నా ముందు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు ఎఫ్సీఐ గోదాములు కట్టేవారని, మోదీ గోదాము కట్టలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాములు కట్టకపోయినా ఫర్వాలేదు కానీ ఎఫ్సీఐలో 40 శాతం గోదాముల నిర్వహణను అదానీకి ఇచ్చారని ఆరోపించారు.
రైతులను ఏకం చేయటమే బీఆర్ఎస్ ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలు బీఆర్ఎస్ జెండాను తీసుకోవాలన్నారు. ఆరేడు జిల్లా పరిషత్లు గెలిస్తే ఫలితం ఎట్లా ఉంటుంది? నేనొక్కసారి నాందేడ్ వస్తేనే రైతులకు ఆరు వేల లాభం ఎలా జరిగిందో తనకు తెలుసన్నారు. ఎన్నటికైనా పోరాటంలో నిజాయితీ ఉన్నవాళ్లు చిత్తశుద్ధితో..ధర్మంతో.. న్యాయబద్దంగా చేస్తారో వారు తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. అందుకు తెలంగాణే నిదర్శమన్నారు.
మహారాష్ట్రలో కష్టపడి పనిచేసే రైతులు, అద్భుతమైన భూమి, పశుసంపద ఉన్నది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దుకోగల సత్తా వారికి ఉన్నది. మహారాష్ట్ర రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగునింపే బాధ్యత నాది. తెలంగాణలో పథకాలు అమలు చేయడం సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?
– సీఎం కేసీఆర్
‘నాందేడ్ సమావేశం తరువాత కేంద్ర మంత్రి వచ్చి మహారాష్ట్రకు కేసీఆర్ వచ్చి ఆగం చేస్తున్నడు.. ఏదో ఒకటి చేయకపోతే కష్టం అని మహారాష్ట్ర సీఎం, డిఫ్యూటీ సీఎంతో రహస్య సమావేశం పెట్టి చెప్పిండు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వాళ్లకు 30-40 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని, తమ ప్రభుత్వాన్ని గట్టేక్కించే మార్గం చెప్పండి అని అడిగితే.. ఆ ఆగంలోంచి పుట్టిందే రైతుకు ఆరువేల భరోసా. ఇస్తే ఎకరానికి రూ.పది వేలు ఇవ్వండి. లేదంటే పక్కకు తప్పుకోండి’ అని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఆరేండ్ల కాలంలో రైతుబంధు ద్వారా రూ.65 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ప్రతీ సంవత్సరం ఒక్కో ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నామని తెలిపారు. ‘రైతుబంధు కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తున్నాం. ఉచిత సాగునీటిని ఇస్తున్నాం. గతంలో పాతబకాయిలను రద్దుచేశాం. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నాం. ఇందుకోసం ఏటా రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పదేండ్లలో రైతులకు నాలుగున్నర లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఫలితంగా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయి, రైతులు ఆర్థికంగా నిలుదొక్కుకున్నారు. రైతులు బెంజ్కార్లు, ఫైవ్స్టార్ హోటళ్లు కావాలని కోరటంలేదు. వారికి అండగా నిలబడితే చాలని కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ కారణం చేత రైతులు చనిపోయినా రైతుబీమా కింద ప్రభుత్వమే రూ.5 లక్షలు చెల్లిస్తున్నదని సీఎం తెలిపారు. కోట్లాది మంది రైతుల జీవితాలను మార్చేపని మనసున్న ప్రభుత్వమే చేయగలుతుందని వ్యాఖ్యానించారు.