హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి అమెరికన్ కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ఐటీ హబ్లో తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అమెరికన్ ఐటీ కంపెనీ క్రిటికల్ రివర్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో ఆదివారం ఈ కంపెనీ ప్రతినిధులు సమావేశమై, వివిధ అంశాలపై చర్చంచారు. నిజామాబాద్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా కనెక్టివిటీ ఉన్నందున రానున్న రోజుల్లో తమ శాఖను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు క్రిటికల్ రివర్ వ్యవస్థాపకుడు అంజి మారం తెలిపారు.
ఈ సంస్థ అమెరికాలోని కాలిఫోర్నియాతోపాటు హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దాదాపు 1,000 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. క్రిటికల్ రివర్ ప్రతినిధులు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాతో కలిసి నిజామాబాద్లో పర్యటించారు. ఇప్పుడు నిజామాబాద్లో యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్టీపీసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.