హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. ఇంటింటికీ మొక్కల పంపిణీతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రగతి కార్యక్రమం పల్లెలు, పట్టణాల్లోని వాడవాడలా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుంది. శనివారం 53,258 మొక్కలను నాటగా, మూడురోజుల్లో 1.83 లక్షల మొక్కలు నాటారు. ఇప్పటివరకు 3.97 లక్షల మొక్కలను పంపిణీచేశారు. 2,420 టన్నుల చెత్తను ఎత్తిపోశారు. 1,234 టన్నుల శిథిలాలు, వ్యర్థాలను తొలగించారు. 1,507 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించారు. 987 కిలోమీటర్ల మేర మురుగు కాలువలను, 119 పార్కులను శుభ్రంచేశారు. 66 వైకుంఠ ధామాల పనులు ప్రారంభమయ్యాయి. 745 దళిత బస్తీల్లో అధికారులు పర్యటించి అక్కడ పరిస్థితులపై అధ్యయనంచేశారు. పట్టణాల్లో 3,706 మీటర్ల మేర విద్యుత్తు వైర్లను సరిచేయగా, మూడు రోజుల్లో 7,045 మీటర్ల మేర వేలాడుతున్న వైర్లను సరిచేశారు. ఇప్పటివరకు 375 వంగిన స్తంభాలను నిలబెట్టారు. 272 తుప్పు పట్టిన స్తంభాలను మార్చారు. 46 వెజ్- నాన్వెజ్ మార్కెట్లకు టెండర్లు పిలవాల్సి ఉండగా, ఇప్పటివరకు 25 టెండర్లు పిలిచారు.
వేములవాడ, జూలై 3: పచ్చదనం పెంచి భావితరాలకు ప్రాణవాయువును అందించేందుకు ప్రతి ఇంట్లో ఒక మొక్కను నాటాలని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, కలిసికట్టుగా ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపాలిటీ 10వ వార్డులో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని కాలనీవాసులకు మొక్కలు అందజేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనూ మొక్కలు నాటారు. కాలనీలో కమ్యూనిటీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణం కోసం తక్షణమే 25లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వేములవాడలో ఇప్పటికే 60 శాతం మిషన్భగీరథ పనులు పూర్తయ్యాయని, దసరాలోగా పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ధర్మసాగర్పల్లి, కోహెడలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చిన్న గ్రామపంచాయతీలకు ఆర్థిక చేయూతను అందించేందుకు త్వరలో సీఎం నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. – కోహెడ
కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శనివారం పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి జిల్లా కేంద్రంలోని 16వ డివిజన్లో కొత్తగా నిర్మించిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. రాంనగర్లో రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణితో కలిసి భూమిపూజ చేశారు. ఇక్కడ కొత్తగా ఇంటర్ లింక్ టైల్స్తో ఏర్పాటు చేసిన రోడ్డును ప్రారంభించి, ఇరువైపులా మొక్కలు నాటారు. – కరీంనగర్ కార్పొరేషన్
రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆ ర్ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం, అడ్డాకుల మండలం పెద్దమునగల్చేడ్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. -మూసాపేట (అడ్డాకుల)
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెంలో శనివారం ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డితో కలిసి పల్లె ప్రకృతి వనం, ఆరోగ్య సేవా కేంద్రం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. -నార్కట్పల్లి
ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలో పారిశుద్ధ్య పనులపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అసహనం వ్యక్తంచేశారు. శనివారం గ్రామంలో పల్లె ప్రగతి పనులను మంత్రి పరిశీలించారు. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో మంత్రి స్వయంగా పార తీసుకొని చెత్తను తొలగించి కాల్వలను శుభ్రం చేశారు. ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మధిరరూరల్