ఖమ్మం : పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దని, పూర్తి స్ధాయిలో ఆయా పనులు పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను అదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. 36వ డివిజన్ PSR రోడ్డులో పక్కన కాల్వలో మురుగు తొలగించే పనులను ప్రారంభించారు. గాంధీ చౌక్ సెంటర్లో రోడ్డు మరమ్మతు పనులను పారతో స్వయంగా చేశారు.
50వ డివిజన్ రాపర్తి నగర్లో నాలాను శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. చెత్త చెదారం తొలగించి పూర్తి స్థాయిలో బాగు చేయాలన్నారు. 51, 52వ డివిజన్ NSP క్యాంపులో ప్రభుత్వ భూములను శుభ్రం చేసి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.
16వ డివిజన్ లక్ష్మి గార్డెన్స్ ఎదురుగా నూతనంగా ఎర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.ఆయా పనుల్లో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరిష్కారం, పురోగతిపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులు కూడా ప్రాథమిక బాధ్యతగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లడుతూ.. అభివృద్దితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయన్నారు. అయితే వాటిని సకాలంలో అర్హులైన వారందరికి అందేలా చూసే బాద్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తప్పక పాల్గొనాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.