తిరుమల: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి (MLA Bethi subhash reddy) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా మంగళవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నానని, అటు నుంచి తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు.
ఎంపీ సంతోష్ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించానన్నారు. ఆయన చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నదని, దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ కార్యక్రమం నిలుస్తున్నదన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంపీ సంతోష్ అవార్డు అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.