ఉప్పల్, నవంబర్ 6: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సోమవారం ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు. ఆయన గెలుపులో భాగస్వామిని అవుతానని ప్రకటించారు. వీరిద్దరి కలయిక పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. విషయం తెలిసిన కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హబ్సిగూడలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిలాంటి సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో కొంత బాధపడిన వాస్తవమేనని, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మాట్లాడి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. కలిసికట్టుగా పనిచేసి బండారిని గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.