Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీలకు సంబంధించి ఇప్పటికే పలు జీవోలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజా మరో జీవో జారీ చేసింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా పదవీ విమరణ సమయంలో అంగన్వాడీల సేవలకు గుర్తింపుగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల్లో 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షలు బీమా సదుపాయం, 50 ఏండ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం.. పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దురదృష్టవశాత్తు సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నది. అంగన్వాడీల డిమాండ్లను మానవీయ దృష్టిలో పరిష్కరించిన సీఎం కేసీఆర్కు స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తోపాటు యూనియన్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆత్మీయ సమావేశం
రాష్ట్రంలోని పలు అంగన్వాడీ యూనియన్ల ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ ప్రాంగణంలో మంత్రి సత్యవతిరాథోడ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జాయింట్ డైరెక్టర్లు లక్ష్మీదేవి, సునంద, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నేత నిర్మలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆయా యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా యూనియన్ల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తాము అడగకపోయినా తమ ఆకాంక్షలను నెరవేర్చిందని సంతోషం వ్యక్తంచేశారు. చిరుద్యోగులమైన తమకు సీఎం కేసీఆర్ పెద్దమనసుతో అక్కున చేర్చుకున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించారని, అందుకు వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు
అంగన్వాడీలకు పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి సత్యవతిరాథోడ్ వివరించారు. గ్రోత్ మానిటరింగ్ కార్డులు ఇతరత్రా అంశాలపై పనిఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించి సరళీకృతం చేస్తామని తెలిపారు. దేశంలో ఎకడా లేనివిధంగా అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీఅంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7,800 చొప్పున వేతనాలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
అంగన్వాడీల గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే
గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన అంగన్వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్యవతి రాథోడ్ చెప్పారు. అంగన్వాడీలను టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పీఆర్సీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వంపై రూ.115 కోట్ల అదనపు భారం పడినా సరే అంగన్వాడీల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలనే సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71 వేల మంది అంగన్వాడీలను కన్నబిడ్డలుగా ఆదరిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు అంతే గౌరవం దక్కాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని వివరించారు. మహిళల సాధికారత, సమగ్ర సేవలు, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేయడానికి అంగన్వాడీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
బాధ్యతలు విస్మరించిన కేంద్రం
గతంలో అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10% ఉండేదని, అయితే మోదీ సర్కార్ భారీగా కోతలు విధించిందని మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు. కేంద్రం తన వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 10 నుంచి 40 శాతానికి పెంచిందని చెప్పారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను తల్లిలా ఆదరిస్తున్నదని తెలిపారు. పెరిగిన అంగవాడీ టీచర్ల వేతనాల్లో 19%, హెల్పర్ల వేతనాల్లో 17% మాత్రమే కేంద్రం ఇస్తున్నదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 80%, హెల్పర్ల వేతనాల్లో 82% ఇస్తున్నదని వెల్లడించారు. ఇది అంగన్వాడీల పట్ల సీఎం కేసీఆర్ ఔదార్యానికి, వాత్సల్యానికి నిదర్శమని కొనియాడారు.
రాష్ట్ర పరిధిలో ఉన్న డిమాండ్లన్నీ పరిష్కరించాం: సత్యవతిరాథోడ్
దేశంలో ఎకడా లేనివిధంగా అంగన్వాడీలకు పెద్దపేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. సర్వీస్లో ఉన్న అంగన్వాడీ టీచర్ దురదృష్టవశాత్తు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20,000, హెల్పర్లకు రూ.10 వేలు అందిస్తామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అంగన్వాడీలకు ప్రతినెల 14వ తేదీలోపు జీతాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. అంగన్వాడీల సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తిచేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.