మహబూబ్నగర్, ఏప్రిల్ 12 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఒకరు, విద్యుదాఘాతానికి ఇద్దరు మరణించారు. నాగర్కర్నూల్, అచ్చంపేట, ఉప్పునుంతల, తిమ్మాజీపేట, రాజాపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. కాగా ఉప్పునుంతల మండలం తాడూర్కు చెందిన గుండేమోని శ్యామలమ్మ (34) శుక్రవారం తన పొలం వద్ద ఉన్న సమయంలో ఈదురుగాలులు వీయడంతో చెట్టుకిందకు వెళ్లింది. ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన అన్నదమ్ములు యూసుఫ్, ఇబ్రహీం ఇంటి సమీపంలో ఇబ్రహీం ఐరన్ డబ్బాలో బోరుమోటర్ వైండింగ్ నిర్వహిస్తున్నారు. కాగా సాయంత్రం వర్షం కురిసిన తర్వాత డబ్బాలోకి వెళ్లిన ఇబ్రహీం భార్య ఆలియాబేగం (40) ఇనుప పైపులను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. అక్కడే ఉన్న తోడికోడలు తస్లీమా బేగం(50) కూడా డబ్బా వద్దకు వచ్చి పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్తు షాక్కు గురై ఇద్దరూ మరణించారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. దాదాపుగా అరగంటపాటు ఆగకుండా కురిసింది. జిల్లాలోని పది మండలాల్లో ఓ మోస్తరుగా వర్షం కురువడంతో పెద్దగా నష్టం జరుగకపోయినా అక్కడక్కడ పాక్షికంగా ధాన్యం తడిసింది.